Spread the love

ఉచిత బస్సు ప్రయాణంలో కీలక మార్పులు…|

తెలంగాణలో మహాలక్ష్మీ పథకానికి ఆదరణ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం వినియోగించుకుంటున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రకటిస్తున్న స్పెషల్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీకి ఆక్యుపెన్సీతో పాటుగా ఆదాయం పెరిగింది. ఇక కొత్తగా ప్రవేశ పెడుతున్న ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేయనున్నారు. కాగా.. తాజాగా ఈ పథకం అమలులో కీలక మార్పులు.. కొత్త నిబంధనలు ఖరారు చేసారు.

మహాలక్ష్మీ పథకంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పథకం వినియోగించు కొనేందుకు కేవలం ఆధార్ కార్డు చూపించి మహిళలు ప్రయాణాలు చేస్తున్నారు. వారికి జరో టికెట్ జారీ అవుతోంది. అయితే.. ఆధార్ కార్డుల్లో చిరునామాలు.. సాంకేతిక సమస్యల కారణంగా ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే సమయంలో పథకం నిర్వహణలో పక్కా ఆడిటింగ్ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక ఐడీ కార్డులను ఇవ్వనుంది. మహాలక్ష్మీ పథకం పేరుతో స్మార్ట్ కార్డులు అందిస్తున్నారు. ఈ కార్డు పైన 16 అంకెల నెంబర్ ఉండనుంది. సీఎం రేవంత్, రవణా శాఖ మంత్రుల ఫొటోలతో పాటుగా మహిళ ఫొటో ఉండనుంది. చిరునామా ముద్రించనున్నారు.

అదే విధంగా ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో పాటు అత్యాధునిక చిప్ ఉంటుంది. కండక్టర్ల వద్ద ఉండే మెషిన్‌తో స్మార్ట్ కార్డులపై ఉండే చిప్‌ను స్కాన్ చేయగానే ప్రయాణ వివరాలు నమోదు చేసుకొనే విధంగా సాఫ్ట్ వేర్ సిద్దం చేసారు. దీని వల్ల మహిళలు ఆధార్ కార్డును చూపించాల్సిన అవసరం లేదు. తమ దగ్గర ఆధార్ కార్డును క్యారీ చేయాల్సిన పని ఉండదు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా సులువుగా మహిళలు ప్రయాణం చేయవచ్చు. ఆధార్ తరహాలోనే ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రతీ మహిళకు ఒక 16 అంకెల విశిష్ట నెంబర్‌ను కేటాయిస్తారు. కార్డు ముందు భాగంలో మహిళ ఫొటో, అడ్రస్ వివరాలు ఉంటాయి. కార్డుల తయారీ కోసం రూ.75 కోట్ల నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలోని 1.5 కోట్ల మంది మహిళలకు కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలుత 5 లక్షల కార్డులను పైలట్ ప్రాజెక్ట్ కింద జారీ చేస్తున్నారు. వీటి పంపిణీ.. అమలు పరిశీలించి పూర్తి స్థాయిలో అందించాలని నిర్ణయించారు. ఇక నుంచి ఉచిత ప్రయాణం లో ఈ కార్డులు కీలకం కానున్నాయి.