Spread the love

తెలుగుప్రజలు అరుణాచలం ఎక్కువ వెళతారు…కారణం

ఈ మధ్య అరుణాచల క్షేత్రం తెలుగువారితో నిండిపోయిందని కొన్ని చోట్ల వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యే తెలుగు వారికి అరుణాచలం గురించి తెలిసింది అని ఎక్కువ మంది నమ్ముతారు.

కానీ, తెలుగువారికి ఆ క్షేత్రం గురించి తెలిసింది ఈ మధ్య కాదు, చాలా ఏళ్ల క్రితమే వారికి దీనితో పరిచయం ఉంది.

హిందువులు విశ్వసించే పంచభూత లింగాల క్షేత్రల్లో ఒకటిగా భక్తులకు అరుణాచలం (తిరువణ్ణామలై) తెలుసు. వాటిలో ఒకటి శ్రీకాళహస్తి ఆంధ్రలోనే ఉండగా, మిగిలిన నాలుగూ తమిళనాడులో ఉన్నాయి.

ఇటీవల ప్రవచనకర్తల ప్రవచనాల కన్నాముందే, తెలుగువారిని అరుణాచలం వైపు ఆకర్షించిన విషయం ఒకటుంది. అదే రమణ మహర్షి. అక్కడకు తెలుగువారు పెరగడంలో రమణ మహర్షి పాత్ర ఎక్కువే.

రమణ మహర్షి మీద భక్తితో దశాబ్దాల క్రితమే తమిళనాడులోని తిరువణ్ణామలైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డ తెలుగు కుటుంబాలు కొన్ని ఇప్పటికీ కనిపిస్తాయి.

అక్కడి ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో ఎందరో తెలుగువారు ఉంటారు. వారంతా 60లు, 70ల నుంచే అరుణాచలానికి తరచూ వెళ్లేవారు.

వారిలో ఎక్కువ మంది అక్కడున్న అరుణాచలేశ్వరుడితో పాటు, ఆ క్షేత్రంలో నివసించిన రమణ మహర్షి, శేషాద్రి స్వామి వంటి సాధువులకు కూడా భక్తులే.

వీరంతా ఆయా సాధువులను సాక్షాత్తూ దేవుడిలాగే చూస్తారు. రమణ మహర్షిపై భక్తితో అక్కడకు వెళ్లినవారు ఎక్కువగా కనిపిస్తారు.

తెలుగునాట ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం, గోదావరి జిల్లాల్లో జిన్నూరు నాన్నగారు.. ఇలాంటి కొందరు రమణ మహర్షి గురించి తెలుగువారికి బాగా తెలియడానికి కారకులయ్యారు.

మరీ చరిత్రలోకి వెళితే, 18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి.

ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.